US Airstrikes: మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్(Iran)ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భారీ ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. దక్షిణ ఇరాన్ ప్రాంతంలో క్షిపణి కేంద్రాలు, సముద్ర భద్రతకు ముప్పుగా మారిన మైన్స్ బోట్లపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది.
ఈ దాడులను అమెరికా సైనిక విభాగం యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా ధృవీకరించింది. తమ బలగాలు మరియు జాతీయ ప్రయోజనాలకు ముప్పు కలిగించే స్థావరాలను గుర్తించి లక్ష్యంగా చేసుకున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ వెల్లడించారు.
ఆత్మరక్షణలో భాగంగానే ఈ దాడులు నిర్వహించినట్లు అమెరికా పేర్కొంది. భవిష్యత్తులో సంభవించే ముప్పులను ముందుగానే అడ్డుకోవడమే తమ లక్ష్యమని అమెరికా స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ, తమ సైనికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని హెచ్చరించింది.
ఇరాన్కు చెందిన సముద్ర దళం సముద్ర మార్గాల్లో ప్రమాదకరమైన మైన్స్ అమర్చడం ద్వారా వాణిజ్య నౌకలు, అమెరికా యుద్ధ నౌకలకు ముప్పు కలిగిస్తోందని అమెరికా ఆరోపించింది. ఈ నేపథ్యంలో అలాంటి బోట్లను గుర్తించి ధ్వంసం చేయడం ద్వారా సముద్ర భద్రతను కాపాడుతున్నట్లు పేర్కొంది.
క్షిపణి కేంద్రాలపై దాడుల ద్వారా ఇరాన్ సైనిక దూకుడును నియంత్రించడమే అమెరికా వ్యూహమని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
US Airstrikes | ఇరాన్ మైన్స్ బోట్లను ధ్వంసం చేసిన అమెరికా.. క్షిపణి కేంద్రాలపై బాంబుల వర్షం
-







