Petrol and diesel prices: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగి వాహనదారులను మరోసారి షాక్ కు గురిచేసింది. అందిన సమాచారం ప్రకారం పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంచినట్లు తెలుస్తుంది. పెంచిన కొత్త ధరలు ఈరోజు నుంచే అమల్లోకి వచ్చాయి.
ఇది కేవలం రెండు వారాల వ్యవధిలో మూడోసారి ధరల పెంపు కావడం గమనార్హం. వరుసగా ఇంధన ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు, రవాణా రంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెరుగుదల లాజిస్టిక్స్ ఖర్చులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగడం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు 40 శాతానికి పైగా పెరిగినట్లు సమాచారం. దీంతో అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది.
ఈ ప్రభావం భారత మార్కెట్పైనా పడుతోంది. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడోసారి పెరిగినట్లు తెలుస్తోంది.
తాజా పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.71కి చేరనుండగా, డీజిల్ ధర రూ.100.86కి పెరగనుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.64కి చేరుకోనుండగా, డీజిల్ ధర రూ.91.58గా ఉండనుంది.
వరుస ధరల పెంపుతో సాధారణ ప్రజలపై అదనపు భారం పడుతుందని, రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.







