Gig workers: దేశవ్యాప్తంగా స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి ఆన్లైన్ డెలివరీ సంస్థలకు చెందిన గిగ్ వర్కర్లు నేడు సమ్మెకు దిగనున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలతో తమ ఆదాయం తీవ్రంగా తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ (gipswu) ఐదు గంటల సమ్మెకు పిలుపునిచ్చింది.
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డెలివరీ భాగస్వాములు తమ యాప్లను ఆఫ్లైన్లో ఉంచనున్నట్లు ప్రకటించారు.
ఇంధన ధరలు, వాహన నిర్వహణ ఖర్చులు పెరిగినా డెలివరీ ఛార్జీలు మాత్రం పెరగకపోవడంతో గిగ్ వర్కర్లు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు యూనియన్ తెలిపింది. కనీస డెలివరీ చార్జీని కిలోమీటర్కు రూ.20కు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మె ప్రభావంతో దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఫుడ్, గ్రోసరీ డెలివరీ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రోజువారీ ఉపాధి కోసం బైక్లు, స్కూటర్లపై ఆధారపడే సుమారు 1.2 కోట్ల మంది గిగ్ వర్కర్లపై పెరిగిన పెట్రోల్ ధరలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని యూనియన్ పేర్కొంది. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఆదాయం లేకపోతే ఈ రంగాన్ని వదిలివెళ్లే పరిస్థితి వస్తుందని కార్మికులు హెచ్చరిస్తున్నారు.
ఇంధన భత్యం, సవరించిన డెలివరీ రేట్లు అమలు చేయాలని ప్రభుత్వం మరియు డెలివరీ సంస్థలకు ఇప్పటికే వినతిపత్రాలు సమర్పించినట్లు గిగ్ వర్కర్ల సంఘం తెలిపింది. తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికే శాంతియుత సమ్మె నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.







