Basara: నిర్మల్ జిల్లా బాసరలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పవిత్ర గోదావరిలో స్నానం కోసం దిగిన అన్నదమ్ములు కనబడకపోవడంతో గ్రామంలో ఆందోళన, విషాదం చోటు చేసుకున్నాయి. హైదరాబాద్లోని కాచిగూడ చప్పల్ బజార్ ప్రాంతానికి చెందిన సోదరులు చంద్రశేఖర్ (38), రాంచందర్ (36), మల్లేష్ కుమార్ (31) మంగళవారం ఉదయం బాసరకు వెళ్లినట్లు సమాచారం. బాసరలోని గోదావరి ఘాట్ వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు వారు నదిలోకి దిగిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. నది ప్రవాహం ఎక్కువగా ఉండటం లేదా లోతు అంచనా వేయలేకపోవడం కారణంగా వారు నీటిలో గల్లంతైనట్లు అనుమానిస్తున్నారు. ఘటనను గమనించిన స్థానికులు తక్షణమే పోలీసులకు తెలియజేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దింపి గోదావరిలో విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. గల్లంతైన సోదరుల ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఆందోళన నెలకొంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.







