Telangana IAS Transfers: తెలంగాణ ప్రభుత్వం ఉన్నత స్థాయి పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టింది. రాష్ట్రంలోని 13 మంది ఐఏఎస్ (IAS) అధికారులను బదిలీ చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పులతో పాటు పలు ముఖ్య శాఖలకు కొత్త అధికారులను నియమిస్తూ బాధ్యతలను పునర్విభజించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం చేనేత, హస్తకళల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్ నియమితులయ్యారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను శైలజా రామయ్యర్కు అప్పగించిన ప్రభుత్వం, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను కూడా ఆమెకే కేటాయించింది.
జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీమ్ను నియమించారు. అదే సమయంలో మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక స్థానమైన ముఖ్య కార్యదర్శిగా ఎన్. శ్రీధర్ను ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర అటవీ ప్రధాన సంరక్షణ అధికారిగా పనిచేస్తున్న వినయ్ కుమార్కు అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది.
ముఖ్యమంత్రి కార్యాలయం (CMO)లోనూ పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ముఖ్యమంత్రి సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎంవో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న బి. అజిత్రెడ్డిని ఇన్వెస్ట్ తెలంగాణ సంస్థ సీఈవోగా బదిలీ చేసింది. పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల అమలులో వేగం పెంచే లక్ష్యంతో ఈ మార్పులు చేపట్టినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
Telangana IAS Transfers | తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ.. కీలక శాఖల్లో మార్పులు
-







