Iran-UAE: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చేపట్టినట్లు చెబుతున్న రహస్య దాడులు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి.
ఇరాన్లోని వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన లావన్ ద్వీప చమురు శుద్ధి కేంద్రంపై గత నెలలో యూఏఈ దాడులు నిర్వహించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వెల్లడించింది.
రోజుకు సుమారు 60 వేల బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేసే ఈ కేంద్రం ఇరాన్ ఇంధన వ్యవస్థలో కీలకంగా భావిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఐదు వారాల పాటు వైమానిక దాడులు కొనసాగించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
ఈ పరిణామాల తర్వాత గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. యూఏఈ చర్యలకు అమెరికా మద్దతు ఉన్నట్లు నివేదికలు పేర్కొంటుండగా, ఇరాన్ ప్రతీకార దాడులకు దిగినట్లు ఆ దేశ ప్రభుత్వ మాధ్యమాలు వెల్లడించాయి.
యూఏఈ, కువైట్లపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. మరోవైపు తమ ఇంధన, మౌలిక వసతులపై దాడులు జరిగినట్లు యూఏఈ, కువైట్ కూడా ధృవీకరించాయి.
పరస్పర క్షిపణి, డ్రోన్ దాడులతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం మరింత తీవ్రమవుతోంది. కాల్పుల విరమణ కొనసాగుతుందా లేదా మరో పెద్ద ఘర్షణకు దారి తీస్తుందా అన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది.







